Sunday, July 15, 2012

అలా అవుతుందనుకోలేదు

 రైలు విజయవాడ సమీపిస్తోంది. ఆ రెండేళ్ళ పిల్లాడు ఖమ్మం దాటిన దగ్గర్నుంచీ ఒకటే ఏడుపు.
ఆకలేమోనని బిస్కట్ పెడదామనికాబోలు సంచీ వెతికింది ఆతల్లి. అయిపోయాయేమో, భర్తకేసి చూసి వచ్చే స్టేషన్లో ఏమన్నా కొనండి అని అడిగింది.

        "సార్! వచ్చే స్టేషన్ ఏమిటండి?" అడిగాడు తండ్రి.

        "విజయవాడ" అన్నాను .

        "ఆ స్టేషనులో తినడానికి దొరుకుతాయాండి?"

        ఏమిటి విజయవాడలో తినడానికి ఏమన్నా....??? నాకు అనుమానం వచ్చి, "మీరు ఈ ప్రాంతానికి కొత్తా" అని అడిగా.

        "అవునండి. లక్నోలో వుంటున్నాం. పుట్టి బుద్ధి ఎరిగాక, దక్షిణాది ప్రాంతాలకే ఇంతవరకూ రాలేదండి"

        నాకు ఆశ్చర్యం వేసింది.

        "మరి తెలుగు బాగానే మాట్లాడుతున్నారే?"

        "మేం తెలుగువారమే. మా తండ్రిగారు లక్నోలో ఏభై ఏళ్ళ క్రితమే సెటిల్ అయ్యారు"

        ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ బ్యాక్ గ్రౌండ్లో పిల్లవాడి ఏడుపు వినబడుతూనేవుంది. "విజయవాడలో తినడానికి దొరుకుతాయి. భోజనం కూడా దొరుకుతుంది" అని అన్నాను.

        ఇంతలో రైలు వేగం తగ్గింది

        "అదిగో విజయవాడ వచ్చేసాం."

        "మీరు ఎందాకా వెళ్తున్నారు?"

        "తెనాలి. మీరో?" అడిగా

         "మద్రాసు"

        రైలు విజయవాడలో ఆగింది. ప్లాట్ ఫారం మీద చాలా సందడిగావుంది. పులిహార, పెరుగన్నం పొట్లాలు అమ్మకానికి వచ్చాయి, చెరో మూడూ కొన్నాడు. తల్లి పెరుగు అన్నం పొట్లం విప్పి ఒక ముద్ద వాడి నోట్లో పెట్టింది. ఠక్కున ఏడుపు ఆపేసి, తినసాగాడు. మరి వాడికి నచ్చలేదో ఏమో తల్లిచేతిలోని పొట్లంలోకి వుమ్మేసాడు.
"ఛీ వెధవా!" అని తల్లి కసిరి పొట్లం సీటు మీద పెట్టింది.

         "ఏమైంది?"

        "ఏమో వీడు తినడంలేదు"

        తండ్రి మరొక పెరుగు పొట్లం విప్పి కొంచెం రుచి చూసి, "అబ్బా! పులుపురొడ్డు" అని కిందపెట్టేసాడు .

        ప్లాట్ ఫారం మీద ఒక కుర్రాడు వీళ్ళూ పొట్లాలు విప్పి తింటున్నారని గమనించి కిటికీ దగ్గరకు వచ్చి అమ్మా అని చెయ్యి జాపాడు..

        "ఇదిగో ఆపెరుగు పొట్లాలు రెండూ వాడికి ఇచ్చెయ్, ఆ ఎంగిలి చేసింది ఇవ్వకు కిందపారెయ్" అని హెచ్చరించాడు భార్యను.

        ఆమె ఆరెండు పెరుగు పొట్లాల్ని ముష్టివాడికి ఇచ్చింది. ఇంతలో బిస్కట్లు అమ్ముతూ వచ్చాడు ఒక వెండరు. తండ్రి బిస్కట్ పొట్లం కొని కొడుక్కి రెండు బిస్కట్లు ఇచ్చాడు. వాటిని తినడం మొదలుపెట్టాడు కుర్రాడు.

         "ఇదేమిటి? ఆపెరుగు పొట్లం పారెయ్యకుండా ఇంకా ఎందుకు అట్టేపెట్టావ్? ఆవతల పారెయ్!" అన్నాడు తండ్రి.

        ఆ పెరుగుపొట్లాన్ని మడిచి ఎదురుగా వున్న కిటికీలోంచి పట్టాలమిదకు విసిరేసింది. అది పట్టాలకి ఇవతలపడింది. ఒక చిన్న కుక్కపిల్ల ప్లాట్ ఫారం మీదనుంచి చెంగున పట్టాల మధ్యకి దూకి ఆ పొట్లంలోని పెరుగు అన్నం ఆబగా తినసాగింది.

        పాపం అది గమనించలేదు. ఆదే పట్టా మీదకు ఒక రైలు నిమ్మదిగా వచ్చి ఆగింది...

        పొట్లంలోని పెరుగు అన్నం ఎర్రగా అయిపోయింది.

No comments: